న్యూఢిల్లీ: కోరేగావ్– బీమా అల్లర్ల కేసులో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవ్లఖాను మరో నాలుగు వారాలపాటు అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవ్లఖా పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ముందస్తు బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిందిగా కోరింది.
మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా నవ్లఖాను విచారించకుండా ఏడాది నుంచి ప్రభుత్వం ఏం చేసిందని ధర్మాసనం నిలదీసింది. నవ్లఖాను అక్టోబర్ 15 వరకు అరెస్టు చేయరాదంటూ అక్టోబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హక్కుల కార్యకర్త నవ్లఖాకు 2017లో జరిగిన కోరేగావ్–బీమా అల్లర్లకు, మావోయిస్టులతో సంబంధాలను రుజువు చేసేందుకు తగు ఆధారాలున్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.