అయోధ్య కేసులో 26 నుంచి సుప్రీం విచారణ

20 Feb, 2019 19:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలవివాదం కేసుపై ఈ నెల 26 నుంచి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 29 నుంచి చీఫ్ జస్టిస్‌ జస్టిస్‌ రంజన్ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వినాల్సి ఉంది. అయితే న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సెలవుపై వెళ్లడంతో విచారణ వాయిదా పడింది. ప్రస్తుతం జస్టిస్‌ బోబ్డే సెలవు నుంచి తిరిగిరావడంతో ఫిబ్రవరి 26 నుంచి కేసు విచారణ ప్రారంభించనున్నట్టు సుప్రీం రిజిస్ట్రార్‌ ప్రకటించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పదభూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.

మరిన్ని వార్తలు