అయోధ్య తీర్పు : రివ్యూ పిటిషన్లపై తేల్చనున్న సుప్రీం

11 Dec, 2019 17:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసులో వెలువడిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను బహిరంగ న్యాయస్ధానంలో విచారణకు చేపట్టాలా లేదా అనే అంశంపై అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సర్వోన్నత న్యాయస్ధానం గురువారం అంతర్గత విచారణ చేపట్టనుంది. బహిరంగ విచారణకు సుప్రీంకోర్టు మొగ్గుచూపితే అన్ని రివ్యూ పిటిషన్‌లను విచారణకు ముందుకు రానుండగా, వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయిస్తే రివ్యూ పిటిషన్‌లను కోర్టు తోసిపుచ్చనుంది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదం కేసులో నవంబర్‌ 9న సుప్రీం కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఇప్పటివరకూ ఏడు పిటిషన్‌లు సర్వోన్నత న్యాయస్ధానం ముందుకు వచ్చాయి.

అయోధ్య తీర్పును సవాల్‌ చేస్తూ సోమవారం 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉ‍త్తర్వులను సవాల్‌ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్‌ దాఖలు చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు