కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

6 Aug, 2018 07:43 IST|Sakshi

ఆర్టికల్‌ 35-ఏ పై విచారణ ప్రారంభించనున్న సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న వివాదస్పద ఆర్టికల్‌ 35-ఏ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభంకానుంది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్‌ 35ఏ ను తొలగిస్తారన్న ఊహాగానాలతో కశ్మీర్‌ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల పాటు కశ్మీర్‌ నిరవధిక బంద్‌కు వేర్పాటు వాదులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 35ఏ ఆర్టికల్‌ను తొలగించాలంటూ సంఘ్‌పరివార్‌కు చెందిన ‘వి ద సిటిజన్స్‌’ అనే స్వచ్చంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హక్కులను తొలగించాలని చూస్తోందంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, వేర్పాటువాద సంస్థలు గత రెండు రోజులుగా ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. కశ్మీర్‌లో త్వరలో పంచాయతీ, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని పలు సంఘాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ మేరకు కశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లేఖ కూడా రాసినట్లు సమాచారం. 

కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేకంగా కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆందోళన చేస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే అధికరణలను తొలగిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయిని ఇటీవల హెచ్చరించాయి. ఆర్టికల్‌ 370, 35-ఏ లేకుంటే కశ్మీర్‌కు, భారత ప్రభుత్వానికి సంబంధం లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్సిస్తూ ఆర్టికల్‌ 35-ఏ ను1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు.

మరిన్ని వార్తలు