పౌరహక్కుల నేతల అరెస్ట్‌; సుప్రీం కీలక వ్యాఖ్య

29 Aug, 2018 18:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అరెస్టైన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్‌ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురిని తమ తమ సొంత ఇళ్లలోనే ఉండనివ్వాలని, బయటికి వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ సందర్భంగా.. అసంతృప్తి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్‌ వంటిదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది.

కాగా పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్‌లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో కోరారు.

గతేడాది డిసెంబర్‌ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు