పేలుడు పదార్థాలు పెట్టి చంపేయండి

26 Nov, 2019 04:14 IST|Sakshi

కాలుష్య కట్టడిలో ప్రభుత్వాల నిర్లిప్తతపై సుప్రీం సీరియస్‌

న్యూఢిల్లీ: లక్షల మంది పౌరుల ఆయుష్షును తగ్గించేస్తున్న వాయు కాలుష్యంపై రాష్ట్రాలు నిర్లిప్తంగా వ్యవహరించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెడుతూ ఢిల్లీ– ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో వాయు కాలుష్యం పెరిగేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రైతులూ కారణమవు తున్నారని ఆక్షేపించింది. వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, వ్యర్థాల నిర్వహణపై తమకు నివేదికలు సమర్పించాలని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల సుప్రీంకోర్టు బెంచ్‌ రాష్ట్రాలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు స్మాగ్‌ టవర్ల నిర్మాణం చేపట్టే అంశంపై కేంద్రం 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘ప్రజలు ఇలా గ్యాస్‌ ఛాంబర్లలో ఎందుకు ఉంటున్నారు? బదులు పేలుడు పదార్థాలు పెట్టి వాళ్లందరినీ చంపేయండి’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనంపై తాము నిషేధం విధించినా ఈ ఏడాది దహనాలు మరింత పెరగడంపై పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను తప్పుపట్టింది. ‘దీన్ని ఇంకా సహించాలా? ఇది అంతర్యుద్ధం కంటే తీవ్రమైంది కాదా? కాలుష్యం కారణంగా లక్షలమంది పౌరుల ఆయుష్షు తగ్గిపోతోంది. వాళ్లను అలా వదిలేద్దామా?’ అని విమర్శించింది.

మరిన్ని వార్తలు