జిల్లాల్లో 2 పోక్సో కోర్టులు: సుప్రీంకోర్టు

17 Dec, 2019 01:33 IST|Sakshi

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో(ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫెన్సెస్‌) చట్టం కింద 300 పైగా ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్న ప్రతీ జిల్లాలో రెండు ప్రత్యేక పోక్సో కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం రాష్ట్రాలను ఆదేశించింది. 100కు పైగా పొక్సొ కేసులు పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో ప్రత్యేకంగా ఒక పొక్సొ కోర్టును ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పష్టతనిచ్చింది. ‘పోక్సో కేసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోక్సో కోర్టుల్లోనే విచారించాలి. ఈ కోర్టులు వేరే కేసులను విచారించకూడదు. జిల్లాల్లో పోక్సో పెండింగ్‌ కేసులు 100కు పైగా ఉంటే ఒక ప్రత్యేక కోర్టు, 300కు పైగా ఉంటే 2 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి’ అని పేర్కొంది. అయితే, జిల్లాలో 100 కన్నా తక్కువ పోక్సో కేసులు పెండింగ్‌లో ఉంటే.. ఇతర అత్యాచార కేసులను ఆ కోర్టులు విచారించవచ్చని వివరించింది.

మరిన్ని వార్తలు