‘అయోధ్య’పై నూతన రాజ్యాంగ ధర్మాసనం

25 Jan, 2019 19:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయంగా ఎంతో సున్నితమైన అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయోధ్య వివాదంపై తొలుత ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మార్పులు చేశారు. తొలుత పేర్కొన్న ధర్మాసనంలో సభ్యులుగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యుయు లలిత్‌ స్థానంలో కొత్తగా జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ నజీర్‌లను తీసుకున్నట్టు ప్రకటించారు. అయితే జస్టిస్‌ యుయు లలిత్‌ మాత్రం గతంలో అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులో లాయర్‌గా ఉన్నందున.. తాను ఈ ధర్మాసంలో కొనసాగలేనని తెలిపారు.

తాజా నిర్ణయంతో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌  డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ నజీర్‌లు సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ ధర్మాసనం జనవరి 29 నుంచి అయోధ్య వివాదంపై విచారణ చేపట్టనుంది. కాగా, జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అయోధ్య వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనంలో జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ నజీర్‌లు  సభ్యులుగా ఉన్నారు.

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత అక్టోబర్‌ 29న వెల్లడించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు