ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణపై స్టేకు ససేమిరా

25 Jan, 2019 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేధింపుల కేసులో నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వొద్దనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఈ సవరణల్లో పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. 2018 మార్చి 20వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టంలో సుప్రీంకోర్టు సవరణలు చేసింది. ఈ సవరణలను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని జస్టిస్‌ ఏకే సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని పునర్‌ నియమించాలని సూచించింది.

ఈ పిటిషన్లపై విచారణకు జస్టిస్‌ యూయూ లలిత్‌ను చేర్చి తిరిగి ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ భాగమైనందున ఆయనను ఇందులో చేర్చాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ అరెస్టులను నిలువరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చుతూ కేంద్ర ప్రభుత్వం నూతన సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు