డ్రగ్స్‌ కేసుపై సుప్రీం విచారణ

10 Sep, 2018 18:46 IST|Sakshi
కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమను కుదిపేసిన మాదకద‍్రవ్యాల కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ దీపక్‌ మిశ్రా సోమవారం విచారణ చేపట్టారు. మాదకద్రవ్యాల కేసుపై సీబీఐ ధర్యాప్తు చేపట్టాలని కోరుతూ సినీ నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గతంలో విచారించిన ధర్మాసనం మాదకద్రవ్యాల వాడకంను అరికట్టెందుకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి, వాటిని అములు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే వాటిని అమలు చేయడానికి తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ మనిందర్‌ సింగ్‌ కోర్టును కోరారు.

దీంతో సోమవారం మళ్లీ విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వం మరింత సమయం కోరడంతో ఈ కేసును ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. దీనిపై కేతిరెడ్డి మాట్లాడుతూ.. అసలు మాదక ద్రవ్యాలతో ఎవరెవరకి సంబంధం ఉందని తెలుసుకోవడం కోసం సీబీఐ విచారణ కోరుతూ గతంలో కోర్టులో పిటిషన్‌ వేశానన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రిని కూడా కోరారని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 18 రాష్ట్రాలను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చానని తెలిపారు. టీవీల్లో డ్రగ్స్‌ వాడకంపై పరిమితులు విధించాలని.. పబ్స్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. చదువుల పేరుతో విదేశీయులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్‌ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు