న్యూఢిల్లీ: ఈవీఎం లేదా వీవీప్యాట్లు సరిగా పనిచేయడం లేదంటూ ఎవరైనా ఓటరు ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు తప్పని తేలిన పక్షంలో సదరు ఓటరుపై కేసు నమోదు చేసేలా ఉన్న నిబంధనను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలపాల్సిందిగా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎన్నికల నిర్వహణ నియమాల్లోని 49ఎంఏ నిబంధన ప్రకారం, ప్రస్తుతం తప్పుడు ఫిర్యాదు చేస్తే ఓటరుపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మెషీన్లు సరిగ్గా పనిచేయక పోవడం పట్ల ఫిర్యాదు చేస్తే ఓటరుపై కేసు నమోదు చేస్తామంటే అది ఓటరు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనంటూ సునీల్ అహైయ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.