తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

17 Jun, 2020 13:58 IST|Sakshi

న్యూఢిల్లీ: మృతదేహాలకు కోవిడ్‌-19 పరీక్షలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆస్పత్రుల్లో మరణించిన వారి మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంపై తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. మే 18, 26 తేదీల్లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినా... వాటిని అమలు చేయకుండా అరకొర సమాచారంతో కోర్టును మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే ఎలాగని ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బుధవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవడం, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం, మృతదేహాలకు పరీక్షలు మొదలైన ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గత సోమవారం విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. భారత వైద్య పరిశోధన మండలి నిబంధనల ప్రకారం మృతదేహాలకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని వైద్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పరీక్షల్లో ఒకవేళ కరోనా పాజిటివ్‌ అని తేలితే మృతుడి కుటుంబసభ్యులకు పరీక్షలు చేయొచ్చు కదా అని ప్రశ్నించింది.(నిర్ధారణ పరీక్షల తీరుపై హైకోర్టు ఆగ్రహం)

అదే విధంగా... కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించగా, హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం.. తామిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనంత వరకు హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు