కోయంబత్తూర్‌ రేప్‌ దోషికి ఉరే సరి

8 Nov, 2019 04:00 IST|Sakshi

రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై/న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కోయంబత్తూరు గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో దోషిగా తేలిన మనోహరన్‌కు మరణ శిక్షే సరైన శిక్ష అని గురువారం సుప్రీంకోర్టు పునః నిర్ధారించింది. ఈ మేరకు ఆగస్ట్‌ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. కోయంబత్తూర్‌లో 2010 అక్టోబర్‌ 29న పాఠశాలకు వెళ్తున్న పదేళ్ల బాలికను, ఏడేళ్ల ఆమె తమ్ముడిని మనోహరన్, మోహన కృష్ణన్‌ అనే ఇద్దరు బలవంతంగా ఎత్తుకెళ్లారు. పిల్లలిద్దరి చేతులు కట్టేసి, ఆ బాలికపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారికి విషమిచ్చి చంపే ప్రయత్నం చేశారు. విష ప్రభావంతో కూడా ఆ చిన్నారులు చనిపోకపోవడంతో.. వారిని చేతులు, కాళ్లు కట్టేసి పరంబికులం–అక్సియార్‌ ప్రాజెక్టు కాలువలో పడేసి ప్రాణాలు తీశారు.

ఆ తరువాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మోహన కృష్ణణ్‌ హతమయ్యాడు. మనోహరన్‌కు ట్రయల్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు ఆ తీర్పును సమర్ధించింది. ఈ ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు సైతం వారికి ఉరే సరైన శిక్ష అని స్పష్టం చేసింది. అత్యంత అరుదైన దారుణంగా ఆ ఘాతుకాన్ని అభివర్ణించింది. అనంతరం మనోహరన్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్‌పై  విచారణ జరిపిన జస్టిస్‌ నారిమన్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా గత తీర్పును సమర్ధిస్తూ రివ్యూ పిటిషన్‌ను 2:1 తేడాతో తోసిపుచ్చారు. మరణ శిక్షను ఇద్దరు న్యాయమూర్తులు సమర్ధించగా, జస్టిస్‌ ఖన్నా మాత్రం చనిపోయేంత వరకు కఠిన కారాగార శిక్ష విధించడం సరైన శిక్ష అవుతుందని అభిప్రాయపడ్డారు. మెజారిటీ జడ్జీల తీర్పు మేరకు మనోహరన్‌కు ఉరిశిక్ష ఖాయమైంది.

మరిన్ని వార్తలు