అయోధ్యపై సుప్రీం కీలక తీర్పు

27 Sep, 2018 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  మసీదులు ఇస్లాంలో అంతర్భాగం కాదని 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించబోమని పేర్కొంది. అయోధ్య భూ యాజమాన్య హక్కులపై ఉన్న కేసును అక్టోబర్‌ 29 నుంచి త్రిసభ్య ధర్మాసనం  విచారిస్తుందని వెల్లడించింది. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హిందూ, ముస్లిం సంస్థల పిటిషన్లపై గురువారం విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పద స్థలం రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందని తీర్పు నిచ్చింది.

సుప్రీంకోర్టు తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో గతంలో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు...
= బాబ్రీమసీదు, దాని చుట్టుపక్కల ఉన్న భూమి సేకరణకు సంబంధించి 1994లో సుప్రీంకోర్టు ఓ రూలింగ్‌ ఇచ్చింది. ఇస్లాం మతాచారాన్ని పాటించడంలో మసీదుకు ముఖ్య భూమికేమి లేదు. నమాజ్‌ను బహిరంగప్రదేశాలతో సహా ఎక్కడైనా నమాజ్‌ను ఆచరించొచ్చునన్నదే ఆ రూలింగ్‌. 

= రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూయాజమాన్యంకేసులో అయోధ్య భూమిని మూడుభాగాలుగా విభజిస్తూ అలహాబాద్‌ హైకోర్టు 2010లో రూలింగ్‌ ఇచ్చింది. ఈ తీర్పునకు  వ్యతిరేకంగా అన్ని పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 

= 2010 అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లపై గురువారం ప్రధానన్యాయమూర్తి దీపక్‌ మిశ్రా బెంచ్‌ విచారణ సందర్భంగా  1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ ప్రస్తావనకు వచ్చింది. ఈ రూలింగ్‌పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ దీనిని ఐదుగురు జడ్జీల ధర్మాసనం విచారించాల్సిందిగా ముస్లింవర్గాల తరఫువారు వాదించారు.  ఈ రూలింగ్‌ విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ తిరస్కరించింది. అయోధ్య–బాబ్రీ భూ యాజమాన్య కేసును ఈ రూలింగ్‌ ప్రభావితం చేయదని స్పష్టంచేసింది. 

= వివాదస్పదంగా మారిన భూయాజమాన్య కేసు విచారణలో జాప్యానికి 1994లో ఇచ్చిన రూలింగే కారణమనే అభిప్రాయం కొందరిలో ఉంది. ఇప్పుడీ కేసు విచారణ వచ్చేనెల 29న మొదలుకానున్న విషయం తెలిసిందే.  1994 రూలింగ్‌పై ప్రస్తుత సు్రంకోర్టు ఆదేశాలతో అయోధ్య భూవివాద కేసు త్వరితగతిన సాగేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఎవరికి ఉపయోగపడని విధంగా ఈ కేసును సార్వత్రిక ఎన్నికల అనంతరం చేపట్టాల్సిందిగా గత డిసెంబర్‌లోనే కాంగ్రెస్‌ నేత, న్యాయవాది కపిల్‌సిబాల్‌ కోర్టుకు విజ్ఞప్తిచేశారు. 
 

మరిన్ని వార్తలు