న్యూఢిల్లీ: హైదరాబాద్ సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వహిస్తున్నసునీతా కృష్ణన్ పంపిన అత్యాచార వీడియోపై సుప్రీంకోర్టు స్పందించింది. అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రానికి సూచించింది. దీంతో పాటు అత్యాచార ఘటనలపై ఓ రిజస్టార్ ను ఏర్పాటు చేయాలంటూ హోంశాఖకు స్పష్టం చేసింది. ఓ మహిళను రేప్ చేస్తున్న వీడియోలను చీఫ్ జస్టిస్ కు సునీత ఒక లేఖ ద్వారా పంపారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ ను రెండు పెన్ డ్రైవ్ లలోసుప్రీంకు అందజేశారు.
ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ తరువాత బలాత్కారం చేసిన ఐదుగురు దుండగులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సామాజిక కార్యకర్త సునీతాకృష్ణన్... మానవ మృగాలను పట్టుకోండి అంటూ జనాలను విజ్ఞప్తి చేశారు. రేపిస్టులను గుర్తించండి అంటూ యూ ట్యూబ్లో వీడియోను పోస్ట్ చేశారు. రేపిస్టుల అంశాన్ని బయటపెట్టిన అనంతరం ఆమెపై దాడి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెపై దాడికి ప్రయత్నించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టారు. అంతే కాదు, ఓ వైపు ఇంత చర్చ జరుగుతుండగానే.. మరో వైపు హ్యాకర్లు రంగంలోకి దిగారు. క్షణాల్లో పోస్టింగ్లను డిలీట్ చేశారు. తన పోస్టింగ్లు మాయమయ్యాయని తెలుసుకున్న సునీత నివ్వెర పోయారు. ఓ అన్యాయంపై పోరాటం చేస్తే.. ఇంత ప్రతి దాడిని ఊహించలేకపోయారు.