భారత్‌లో ఏడుకు చేరిన కరోనా మరణాలు

22 Mar, 2020 16:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్‌-19) బారిన పడి గుజరాత్‌లో ఓ 69 ఏళ్ల  వృద్ధుడు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. గత నాలుగు రోజులుగా సూరత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు వదిలారు. అతను రైలుమార్గం గుండా ఢిల్లీ నుంచి జైపూర్‌ మీదుగా సూరత్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అంతకు ముందు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి(63), బిహార్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య ఏడుకు పెరిగింది. 

భారత్‌లో తొలి కరోనా మరణం కర్ణాటకలోని కలబుర్గిలో చోటు చేసుకోగా.. రెండో మరణం ఢిల్లీలో సంభవించింది. ముంబైలో ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. శనివారం రాత్రి బిహార్‌లో 38 ఏళ్ల వ్యక్తి కోవిడ్ కారణంగా చనిపోయాడు.

మరిన్ని వార్తలు