సూర్యతో ఐదోసారి

16 Oct, 2014 00:19 IST|Sakshi
సూర్యతో ఐదోసారి

నటుడు సూర్యతో ఐదో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు హరి. ఇంతకుముందు వీరి కలయికలో ఆరు, వేల్, సింగం, సింగం-2 చిత్రాలు రూపొందాయి. ఇవన్నీ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. మరో విషయం ఏమిటంటే నటుడు విజయ్ చిత్రం (తమిళ్)తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన హరి సూర్యతోనే అధిక చిత్రాలు చేశారు. ప్రస్తుతం విశాల్ హీరోగా పూజై చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పక్కా మాస్ మసాలా చిత్రమే. ఇది దీపావళికి తెరపైకి రానుంది.
 
 ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ తనకు తెలిసింది కమర్షియల్ చిత్రాల రూపకల్పనేనన్నారు. పూజై కమర్షియల్ చిత్రం అయినా కుటుంబ సమేతంగా చూసి ఆనందించేదిగా ఉంటుందన్నారు. పూజై చిత్రాన్ని 100 రోజుల్లో షూటింగ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకుని 90 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. ఈ క్రెడిట్ విశాల్‌కే దక్కుతుందన్నారు. పూజై చిత్రం విడుదల తరువాత సూర్య హీరోగా చిత్రం తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. వీరి కాంబినేషన్‌లో సింగం -3 తెరకెక్కనున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది.
 
 
 ఈ విషయం గురించి హరి వద్ద ప్రస్తావించగా సూర్యతో రూపొందించనున్న చిత్రం స్క్రిప్ట్ ఇంకా సిద్ధం చేయలేదని, కథ తయారైన తరువాత వివరాలు తెలియచేస్తానన్నారు. సూర్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత మలయాళ దర్శకుడు విక్రమన్‌తో ఒక చిత్రం చేయనున్నారు. ఆ తరువాతనే హరి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే ఈ చిత్రం సెట్‌పైకి వచ్చే అవకాశం ఉంది. విజయ్, అజిత్ హీరోలుగా కూడా చిత్రాలు చేస్తానంటున్నారు దర్శకుడు హరి.  
 

మరిన్ని వార్తలు