హరీశ్‌ సాల్వేకు రూ.1 ఫీజు చెల్లించిన బన్సూరి

28 Sep, 2019 08:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దివంగత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ చివరి కోరికను నెరవేర్చారు ఆమె కుమార్తె బన్సూరి. ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వేకు, సుష్మ ఇవ్వాల్సిన రూ.1 ఫీజును శుక్రవారం చెల్లించారు బన్సూరి. ఈ సందర్భంగా ‘కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో వాదించి, గెలిచినందుకు గాను హరీశ్‌ సాల్వేకు ఇవ్వాల్సిన ఫీజు రూ.1ని ఈ రోజు చెల్లించి నీ చివరి కోరిక నెరవేర్చాను అమ్మ’ అంటూ బన్సూరి ట్విట్‌ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున హరీశ్‌ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్‌ హరీశ్‌తో మాట్లాడారు. ‘మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి’ అని చెప్పారు అంటూ హరీశ్‌ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్‌, హరీశ్‌ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు.

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్‌ జైల్లో ఉన్న మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాక్‌ న్యాయస్థానం విధించిన మరణశిక్షను నిలుపదల చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చేలా చేయడంలో హరీశ్‌ సాల్వే వాదనలు కీలకంగా నిలిచిన సంగతి తెలిసిందే.
(చదవండి: వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ)

మరిన్ని వార్తలు