కిడ్నీ ఫెయిల్యూర్.. ఆస్పత్రిలో సుష్మా స్వరాజ్

16 Nov, 2016 10:36 IST|Sakshi
కిడ్నీ ఫెయిల్యూర్.. ఆస్పత్రిలో సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. ఏయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు సుష్మా స్వరాజ్ ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం తాను ఢిల్లీలోని ఏయిమ్స్‌లో జాయిన్ అయ్యాయని.. డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిమిత్తం తనకు ఏయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు. కృష్ణ భగవానుడి ఆశీస్సులతో తిరిగి కోలుకుంటానని సుష్మా దీమా వ్యక్తంచేశారు.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్‌పై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా స్పందించారు. సుష్మా ఆనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలన్నారు. తమ ప్రార్థనలు, భగవంతుడి ఆశీస్సులతో సుష్మ ఆరోగ్యం మెరుగవుతుందని వసుంధర రాజే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సుష్మా త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు