ఐదుగురిని కాల్చిచంపిన అల్ఫా మిలిటెంట్లు

2 Nov, 2018 04:09 IST|Sakshi

ఖెరోనిబరి: అస్సాంలో నిషేధిత అల్ఫా(ఇండిపెండెంట్‌) తీవ్రవాదులు గురువారం రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని ఖెరోనిలో ఐదుగురు పౌరుల్ని కాల్చిచంపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులున్నారు. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కొందరు సాయుధ అల్ఫా తీవ్రవాదులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఖెరోనిలోని ధోలా–సదియా వంతెన వద్దకు చేరుకుని ఐదారుగురు గ్రామస్తుల పేర్లను పిలిచారని తెలిపారు. దీంతో బయటకు వచ్చినవారిపై సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ దాడిని ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు