విభజన బిల్లుపై లోక్సభలో చర్చ జరగుతున్న సమయంలో సస్పెండైన సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హాలులో నిరసన కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రం తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, నిమ్మల కిష్టప్ప (టీడీపీ) ఒక దశలో సభ లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. సభ తలుపులను గట్టిగా కొడుతూ నినాదాలు చేశారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. చర్చ సందర్భంగా లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. సభ వాయిదా పడిందంటూ లోక్సభ టీవీలో స్క్రోలింగ్ రావడంతో అది నిజమేనని భావించారు. కానీ గందరగోళం నడుమే చర్చ జరుపుతున్నారని తెలిసి అవాక్కయ్యారు.