మిడతల దండు దాడి మళ్లీ మొదలు

27 Jun, 2020 13:02 IST|Sakshi

ఢిల్లీ : దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మిడతల దాడి ఆందోళనకు గురిచేస్తుంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మిడతల దండు దాడి మళ్లీ మొదలైంది. తాజాగా శనివారం గురుగ్రామ్‌లో మిడతల దండు వీరవిహారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండు నెలల నుంచి రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు  రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాజాగా గురుగ్రామ్‌లో మొదలైన మిడతల దండు దాడి మెళ్లిగా ఢిల్లీలోకి వ్యాపించే ప్రమాదం ఉండడంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.(భారత్‌ గట్టిగా పోరాడుతోంది : మోదీ)

పంటలను నాశనం చేసే మిడతల దండు గురుగ్రామ్‌ సిటీతో పాటు సైబర్‌ హబ్‌ ప్రాంతమైన డిఎల్‌ఎఫ్ ఫేజ్ I-IV, చక్కర్‌పూర్, సికందర్‌పూర్, సుఖ్రాలి ఏరియాలో పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు శుక్రవారం సాయంత్రమే అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇంట్లోని వస్తువులను గట్టిగా వాయించడం, పటాకులు కాల్చడం, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. కాగా మిడతలు దండు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియోలు తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా మిడతల దండు దాడిని తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

మరిన్ని వార్తలు