దాడికి తెగబడింది ఎంతమంది?

2 Jan, 2016 12:55 IST|Sakshi
దాడికి తెగబడింది ఎంతమంది?

పఠాన్‌కోట్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులను ఏరివేశాం... ఎన్కౌంటర్ ముగిసిందని అధికారులు ప్రకటించిన కాసేపటికే మరోసారి కాల్పుల ఘటన మరింత ఉద్రిక్తతను రాజేసింది. రెండుసార్లు భారీ ఎత్తున పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. ఆపరేషన్ ఇంకా ముగియలేదని, ఐదో టెర్రరిస్టు కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. దీంతో దాడికి వచ్చినది ఎంత మంది ఉగ్రవాదులన్న చర్చ మొదలైంది. ఆరుగురి వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో  అధికారులు స్వాట్  బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బృందం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, డిఐజీ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని  పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు.

అటు ఉగ్రవాదుల, భద్రతాదళాల మధ్య జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భద్రతా దళాల జవానుల సంఖ్య మూడుకు పెరిగింది. తీవ్రంగా గాయపడిన జవాను చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

పంజాబ్లోని కీలకమైన  ప్రాంతాన్ని ఎంచుకున్న ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్టు స్పష్టమవుతోందని శివసేన ఆరోపించింది. ఇది జాతికి పెద్ద హెచ్చరిక అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ తర్వాత పాక్ ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్‌గా  ఎంచుకున్నారన్నారు. పాక్ ఉగ్రదాడులకు వారి భాషలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు