ఇదే కదా.. నిజాయితీ అంటే! 

5 Apr, 2020 08:45 IST|Sakshi
స్వీట్‌ షాపు, షాపు వద్ద ఉంచిన బ్రెడ్‌లు, కొనుగోలు చేస్తున్న స్థానికులు

సాక్షి, చెన్నై : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడ్డ ఓ స్వీట్‌ షాపు ప్రజల మీద నమ్మకంతో సెల్ఫ్‌ సర్వీస్‌ మీద బ్రెడ్‌ ప్యాకెట్ల అమ్మకాలు సాగిస్తోంది. జనం కూడా  సిబ్బంది ఎవరూ లేని ఆ దుకాణంలో ఉంచిన బ్రెడ్‌లకు తగిన డబ్బులు పెట్టి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ కారణంగా కోవై రత్నపురం వంతెన వద్ద ఉన్న ఓ స్వీట్‌ షాపు మూసి వేసినప్పటికి దాని ముందు బెడ్‌ ప్యాకిట్లను ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు నిర్వాహకులు. అయితే వాటిని విక్రయించడానికి సిబ్బందిని నియమించలేదు. అందుకుబదులుగా బ్రెడ్‌ ట్రే వద్ద ఒక ప్రకటన బోర్డు ఉంచారు. ( ఎంత పద్దతిగా రోడ్డు దాటుతున్నాయో చూడండి )

అందులో బ్రెడ్‌ ధర రూ.30 అని, అవసరమైన మేరకు బ్రెడ్‌ను తీసుకుని, అందుకు తగిన మొత్తాన్ని పక్కనే ఉన్న డబ్బాలో వేసి వెళ్లాలని సూచించారు. ఆ ప్రాంత వాసులు అక్కడికి వెళ్లి బ్రెడ్‌ను తీసుకుని, డబ్బాలో సరిపడా డబ్బును వేసి వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో దాన్ని చూసిన అనేక మంది నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తున్న కోవై ప్రజలు, దుకాణ యజమాని నమ్మకానికి లైక్‌లతో ముంచెత్తుతున్నారు. ( ఆశ్చర్య పరుస్తున్న బామ్మ ఫిట్‌నెస్‌! )

మరిన్ని వార్తలు