తాజ్‌మహల్‌ పచ్చదనానికి కోతులతో ముప్పు!

21 Mar, 2018 22:54 IST|Sakshi

ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని  పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్‌ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. 

అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు.  ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో  బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. 

యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు