కోవిడ్‌-19 ఆస్పత్రిగా ఫైవ్‌స్టార్‌ హోటల్‌

16 Jun, 2020 16:21 IST|Sakshi

ఢిల్లీలో మహమ్మారి విజృంభణ

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులతో ఢిల్లీలోని ఫైవ్‌స్టార్‌ తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌ సర్‌ గంగారాం ఆస్పత్రికి అనుబంధంగా సేవలందించనుంది. రోగులకు ఆహారం, గదులను ఈ హోటల్‌ సమకూర్చే బాధ్యత చేపడుతుందని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోగులు వైద్య సేవలు పొందినందుకు ఆస్పత్రికి చెల్లించే డబ్బును హోటల్‌కు రీఎంబర్స్‌ చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రోజుకు 5000 రూపాయలతో పాటు వైద్యసేవలకు మరో 5000 రూపాయలు వసూలు చేస్తారు.

ఇక ఆక్సిజన్‌ సిలిండర్‌ కేటాయించినందుకు రోజుకు 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌ సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు అందచేయడంతో పాటు మౌలిక అంశాల్లో శిక్షణ కల్పిస్తారు. ఆస్పత్రికి చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది హోటల్‌లోనే ఉండే వెసులుబాటు ఉండగా ఈ వ్యయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు భరించాలి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లో చాలినన్ని బెడ్స్‌ లేకపోవడంతో హోటల్స్‌ను ఆస్పత్రులకు అటాచ్‌ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

చదవండి : తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే.. వామ్మో!

మరిన్ని వార్తలు