తల్లిదండ్రులను చూడకపోతే శాలరీ కట్

8 Feb, 2017 16:29 IST|Sakshi
తల్లిదండ్రులను చూడకపోతే శాలరీ కట్
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝుళిపించనుంది. వయసు పైబడిన వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి  కొంత మొత్తాన్ని కట్ చేసి అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు.
 
 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అతని తల్లిదండ్రులకు ఇస్తుందని తెలిపారు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు.
>
మరిన్ని వార్తలు