సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

17 Sep, 2019 14:26 IST|Sakshi

సాక్షి, చెన్నై:  వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి  ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో  సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం రామనాధపురం జిల్లా కౌముది సమీపంలోని వీరదాకుళంకు చెందిన మలైస్వామి పీవీ సింధుకు వీరాభిమాని. అయితే  అతడి అభిమానం హద్దులు దాటింది. మంగళవారం కలెక్టర్‌ వీర రాఘవరావును కలిసి మలై స్వామి ఓ వినతి పత్రం అందించాడు. ఏదో ఫించన్‌ రాలేదనో, మరెదో సమస్యతో వినతి పత్రం ఇచ్చి ఉండవచ్చని భావించి, దాన్ని తక్షణం తెరచి చూశారు.

ఈ సందర్భంగా మలైస్వామి ...సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇద్దరి ఫోటోలను (సింధు, మలైస్వామి) జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఆ పిటిషన్‌లో మలైస్వామి ... తన వయస్సు కేవలం 16 ఏళ్లని, 2004 ఏప్రిల్‌ 4న పుట్టానని పేర్కొన్నాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్‌తో పాటు విషయం తెలిసినవాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే మలైస్వామి మాత్రం సింధుతో తన పెళ్లి చేయాల్సిందేనని పట్టుపట్టాడు.  చివరికి మలైస్వామికి అధికారులు చీవాట్లు పెట్టి అక్కడ నుంచి పంపించివేశారు. కాగా, మలైస్వామి తరచూ ఇలాంటి వివాదాస్పద వినతి పత్రాలతో కలెక్టరేట్‌కు రావడం పరిపాటిగా మారడంతో ...మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అక్కడ నుంచి పంపించివేశారు.

సింధుతో పెళ్లి చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు అర్జి ఇచ్చిన మలైస్వామి

మరిన్ని వార్తలు