టీడీపీకి చావుదెబ్బ

25 May, 2019 13:26 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: జాతీయ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌ కావాలని పావులు కదిపిన చంద్రబాబుకు, ఆయన సారథ్యంలోని టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిదెబ్బతగిలిందని తమిళనాడులోని మీడియా కథనాలు ప్రసారం చేసింది. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ టీడీపీని చావుదెబ్బకొట్టిందని పేర్కొన్నాయి. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఒక్క ఏపీలోనే అధికార పార్టీ అధికారాన్ని కోల్పోయింది అంటూ దినపత్రిక ‘దినమలర్‌’ కథనాన్ని ప్రచురించింది. ‘పాదయాత్ర నాయకుడు’ అంటూ వైఎస్‌ జగన్‌ను ప్రశంసించింది. జగన్‌ రాజకీయ జీవితంలో అనేక అడ్డంకులను అధిగమించారని పేర్కొంది.  

జగన్‌కు స్టాలిన్‌ శుభాకాంక్షలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న మిత్రుడు, ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కు స్టాలిన్‌ ట్వీటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు