అమానుషం: విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి

6 Feb, 2020 16:48 IST|Sakshi

చెన్నై: ఓ వైపు సాంకేతికత  శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్‌ శ్రీనివాసన్‌ గురువారం తెప్పక్కాడుకులోని ముదుమలై టైగర్‌ రిజర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చారు.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శిబిరానికి వెళుతుండగా మం‍త్రి శ్రీనివాసన్ ఓ గిరిజన విద్యార్థిని పిలిచి.. తన కాళ్లకు ఉన్న చెప్పులు తీయాలని ఆదేశించాడు. ఏం చేయలేని స్థితిలో ఆ పిల్లవాడు అందరూ చూస్తుండగానే మంత్రి కాళ్లకు ఉన్న చెప్పలను తొలగించాడు. తర్వాత మంత్రి అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో దళిత సంఘాలు మంత్రి ప్రవర్తనపై మండిపడుతున్నాయి. గిరిజన విద్యార్థితో మంత్రి చెప్పులు మోయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు చూస్తూ నిలుచున్నారే తప్ప ఏ ఒక్కరు ఈ పనికి అడ్డు చెప్పలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అతన్ని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు