‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు

15 Aug, 2019 03:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్‌ ఇండెక్షన్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ చిన్న రాజ్‌ చెప్పారు. దిండుగల్‌ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్‌ ఫుడ్‌ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు