కేరళ వరదలు : కారణం ఎవరంటే..

23 Aug, 2018 20:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లిన కేరళ తమ రాష్ట్రంలో వరదలకు కారణం తమిళనాడేనంటూ మండిపడింది. తమిళనాడు తీరును తీవ్రంగా తప్పుపట్టిన కేరళ ముళ్లపెరియార్‌ డ్యాం నుంచి ఒక్కసారిగా నీళ్లు వదలడంతోనే ఈ విపత్తు చోటుచేసుకుందని ఆరోపించింది. డ్యాం నుంచి ఒకేసారి నీళ్లు విడుదల చేయవద్దని తమిళనాడు సర్కార్‌ను కోరినా వినిపించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

డ్యాం నీళ్లు పోటెత్తడంతో కేరళలో వరదలొచ్చాయని సుప్రీం కోర్టుకు కేరళ నివేదించింది. అంతకుముందు ఇదే కేసులో గతంలో ముళ్లపెరియార్‌ డ్యాంలో నీటి మట్టాన్ని 139 అడుగులకు తగ్గించాలని, అప్పుడే కేరళ ప్రజలు భయభ్రాంతులకు లోనవకుండా ఉంటారని సర్వోన్నత న్యాయస్ధానం తమిళనాడును కోరింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కాగా వివాదాస్పద ముళ్లపెరియార్‌ డ్యామ్‌ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్‌ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం నడుస్తోంది.

మరిన్ని వార్తలు