కొత్త రైళ్లు వచ్చేనా?

8 Jul, 2014 08:01 IST|Sakshi
కొత్త రైళ్లు వచ్చేనా?

 సాక్షి, చెన్నై:  యూపీఏ-1లో తమిళనాడుకు కలిసి వచ్చే అంశాలు అధికంగా ఉన్నాయి. యూపీఏ భాగస్వామి డీఎంకే రాష్ట్రంలో అధికారంలో ఉండడం అందులో ఒకటి. యూపీఏ -2లో పరిస్థితి తారుమారు అయింది. యూపీఏ హామీలు బుట్టదాఖలయ్యాయి. ప్రధానంగా రైల్వే ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధుల్ని విదిల్చారు. రాష్ట్రంలో డీఎంకే పతనం అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో పరిస్థితి మరీ దారుణం అయింది. కొత్త రైల్వే ప్రాజెక్టుల మీద యూపీఏ -2 దృష్టి పెట్ట లేదు. అమల్లో ఉన్న ప్రాజెక్టులు మరింత నత్తనడకన సాగే పరిస్థితికి తీసుకొచ్చారు.
 
 ఈ పరిస్థితుల్లో తాజాగా కేంద్రంలో అధికారం మారింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్‌ను ప్రకటించేందుకు సిద్ధం అయింది. అయితే, ఈ బడ్జెట్‌లో తమిళనాడు మీద ఏ మేరకు కేంద్రం దృష్టి సారించనుందోనన్న ఎదురు చూపులు పెరిగాయి. కేంద్రంతో సామరస్యంగా మెలిగేందుకు రాష్ర్టంలోని అన్నాడీఎంకే సర్కారు అడుగులు వేస్తున్న సమయంలో మోడీ సర్కారు ఏ మేరకు తమిళుల మీద ప్రేమ చూపనుందో మరి కాసేపట్లో తేలిపోతుంది.
 
 కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో ఆ రాష్ట్రానికి వరాలు కురిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమిళనాడులో అమల్లో ఉన్న ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారో, కొత్త రైళ్ల సేవలకు ఏ మేరకు శ్రీకారం చుడుతారోనని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ సైతం పావులు కదుపుతున్న నేపథ్యంలో, రాష్ట్రానికి అత్యధికంగా రైల్వే నిధులు తెప్పించుకునేందుకు కమలనాథులు కృషి చేశారా? లేదా అన్న విషయం కూడా తేటతెల్లం కాబోతున్నది.  
 
 ఎదురు చూపులు: నిధుల కోసం ఎదురు చూస్తున్న అనేక రైల్వే ప్రాజెక్టులు తమిళనాడులో ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతుంటే, మరి కొన్ని నిధులు వచ్చినప్పుడల్లా, పరుగులు తీయడం, ఆ తర్వాత ఆగడం పరిపాటే. కొన్ని ప్రాజెక్టులు అయితే, కేవలం హామీకే పరిమితమయ్యాయి. ఇందులో కొన్ని
  చెన్నై - తిరుపతి మధ్య ప్రకటించిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పట్టాలు ఎక్కలేదు.
 
  చెన్నై సెంట్రల్ నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా ప్రకటించిన ఐదు రైళ్ల ఊసే లేదు.
  నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్న చెంగల్పట్టు - విల్లుపురం రెండో మార్గం పనులకు మోక్షం లేదు.
  మదురై - కన్యాకుమారి రెండో మార్గం పనులు ఆగిపోయూయి.
  మదురై-బోడి నాయకనూర్, తెన్‌కాశి - పునలూర్, పొల్లాచ్చి-పళని రైల్వే మార్గాల పనులకు నిధులు వచ్చేనా, కొత్త రైళ్లు నడి చేనా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు.
 
కొత్త  ఆశలు...: దక్షిణాదికి నిత్యం చెన్నై నుంచి వెళ్లే రైళ్లు కిక్కిరిసి ఉంటాయి. దీంతో తమ ప్రాంతాల మీదుగా అంటే తమ ప్రాంతాల మీదుగా రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలన్న విజ్ఞప్తులు రైల్వేశాఖ చెంత ఉన్నాయి. ఈ ప్రతిపాదనల్లో ఉన్న అంశాలు ఇవి
దిండివనం - నగరి, గూడువాంజేరి - శ్రీ పెరంబదూరు కొత్త రైల్వే మార్గాలు ఏర్పాటు చేయూలి
జోలార్ పేట - హోసూరు, అరక్కోణం - కాట్పాడి,  రామేశ్వరం - ధనుస్కోడిలకు అదన ంగా  కొత్త రైల్వే మార్గాలకు అనుమతించాలి
 తిరుచ్చి-నెల్లై ఇంటర్ సిటీ కన్యాకుమారికి పొడిగించాలి
చెన్నై షిరిడీ వారాంతపు రైలు ఇక వారంలో మూడు రోజులు నడిపించాలి
చెన్నై - నాగుర్ కోయిల్ మధ్య రోజు వారీగా రైలు సేవలు సాగాలి
మదురై - దిండుగల్, కోయంబత్తూరు - తిరుప్పూర్, తిరుచ్చి - తంజావూరు మధ్య ఎలక్ట్రిక్ రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలి.
 
చెన్నై సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా తాంబరం స్టేషన్‌ను మూడో టెర్మినల్‌గా ప్రకటించి, నిధులు కురిపించాలి. చెన్నై నుంచి కన్యాకుమారి, రామేశ్వరానికి పగటి పూట అన్ రిజర్వుడ్ బోగీలతో రైళ్లు నడపాలి చెన్నై - గోవా, చెన్నై - మూసూర్, చెన్నై - కాయంకుళం, చెన్నై - తిరువణ్ణామలై  మధ్య కొత్త రైళ్ల సేవలకు శ్రీకారం చుట్టాలి అన్న డిమాండ్లు సదానంద బడ్జెట్ ముందు ఉన్నాయి.

మరిన్ని వార్తలు