‘ఆ కొరియోగ్రాఫర్‌ను దూరం పెట్టాలి’

30 Jan, 2020 12:11 IST|Sakshi

ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యను బహిష్కరించాలని బాలీవుడ్‌ భామ తనుశ్రీ దత్తా సినీ పరిశ్రమను కోరారు. బాలీవుడ్‌ సహా ఇతర సినీ పరిశ్రమలు గణేష్‌ ఆచార్యను పూర్తిగా బహిష్కరించాల్సిన సమయం ఇదేనని ఆమె పేర్కొన్నారు. పురుష సూపర్‌స్టార్‌లతో పనిచేస్తూ మహిళా డ్యాన్సర్లు, నటులను వేధిస్తున్న అతడికి బుద్ధి చెప్పాలని అన్నారు. పరిశ్రమలో తన హోదాను అడ్డుపెట్టుకుని వర్థమాన నటీమణులు, కొరియాగ్రాఫర్లను గణేష్‌ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. హార్న్‌ ఓకే ప్లీజ్‌ సెట్‌లో తాను ఎదుర్కొన్న వేధింపుల్లో గణేష్‌ ఆచార్య పాత్ర కూడా ఉన్నప్పటికీ ఆ తర్వాత తన ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం సాగించాడని గతంలో తాను చేసిన మీటూ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆమె పేర్కొన్నారు. హార్న్‌ ఓకే ప్లీజ్‌ సెట్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులు, భయాందోళన పరిశ్రమను వీడేలా చేశాయని వీటితో తాను ఎదుర్కొన్న మానసిక, ఆర్థిక సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కారుపైనా వారు దాడి చేశారని, వారు నా కారును మాత్రమే ధ్వంసం చేయలేదని..నా మానసిక స్థైర్యాన్ని, స్ఫూర్తినీ దెబ్బతీశారని అన్నారు.

చదవండి : వేధింపులు చిన్న మాటా!

మరిన్ని వార్తలు