మధ్యతరగతికి కొంత ఊరట!

2 Feb, 2017 02:27 IST|Sakshi
మధ్యతరగతికి కొంత ఊరట!

5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు
రిబేట్‌ మాత్రం రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు
బేసిక్‌ లిమిట్‌లో ఎటువంటి మార్పులూ చేయని జైట్లీ
పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ
రూ.5 లక్షలలోపు వేతన జీవులకు సింగిల్‌ పేజీ ట్యాక్స్‌ రిటర్నులు
తొలిసారి రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి స్క్రూటినీ ఉండదు  

ఎవరి ఆదాయంపై ఎంత పన్ను ఉంటుందో చూస్తే...
అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రేట్లు భారీగా తగ్గుతాయని ఆశించిన వేతన జీవులకు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మరీ ఎక్కువగా కాకున్నా కొంత ఊరటనిచ్చారు. బేసిక్‌ లిమిట్‌ జోలికి వెళ్లకపోయినా... ఏడాదికి రూ.10 లక్షల వరకూ వేతనం ఉండే మధ్య తరగతి వేతన జీవులందరికీ మరికొంత మొత్తం జేబులో మిగిలేలా చర్యలు తీసుకున్నారు. మినహా యింపులన్నీ పోను... పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.2.5 లక్షలు దాటి రూ.5 లక్షల మధ్యలో ఉంటే... దానిపై ఇప్పటిదాకా విధిస్తున్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆ రకంగా వారు చెల్లిస్తున్న పన్ను లో 50 శాతాన్ని మిగిల్చారు. అయితే ఒకచేత్తో ఇస్తూనే మరో చేత్తో తీసుకున్న మాదిరిగా సెక్ష న్‌ 87ఏ కింద ఇస్తున్న ట్యాక్స్‌ రిబేట్‌ను (చెల్లించాల్సిన పన్నును తగ్గించడం) సగానికి సగం తగ్గించేశారు. పైపెచ్చు దాని పరిధిని కూడా కుదించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ. 5,000 ట్యాక్స్‌ రిబేట్‌ లభించేది. అంటే చెల్లిం చాల్సిన పన్నులోంచి రూ.5,000 మినహా యించి మిగిలింది చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.2,500కు కుదించారు. పైపెచ్చు ఈ రిబేటు కేవలం రూ.3.50 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు. ఇప్పుడు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను భారం పడదు.

కానీ వీరు రిటర్నులు తప్పనిసరిగా వేయాలి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.3 లక్షలు దాటి రూ.3.50 లక్షల లోపు ఉంటే వారిపై రూ.2,500 పన్ను పడుతుంది. ఇదివరకు వీరు రిబేటు పోను రూ.5,000 చెల్లించాల్సి వచ్చేది. సెక్షన్‌ 80సీ కింద పొదుపు, వ్యయాలపై లభించే రూ.1.50 లక్షల మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.4.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ పడే అవకాశం లేదు. రూ.5,00,000 దాటిన వారందరికీ రూ.12,500 వరకు పన్ను భారం తగ్గుతుంది.


అధికాదాయం... సర్‌చార్జీ వడ్డింపు
పన్ను చెల్లించాల్సిన ఆదాయం కనుక రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటే 10 శాతం సర్‌చార్జీని కొత్తగా వడ్డించారు. గతేడాది కోటి రూపాయలు దాటిన వారిపై విధించిన 15 శాతం సర్‌చార్జీని కొనసాగి స్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు సులభంగా రిటర్న్స్‌ దాఖలు చేసేలా సింగిల్‌పేజీ రిట ర్న్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి ప్రక టించారు. అదే విధంగా తొలిసారి రిటర్నులు దాఖలు చేసిన వారిని స్క్రూటినీ చేయబోమని ఆర్థికమంత్రి హామీనిచ్చారు. బేసిక్‌ లిమిట్‌ రూ. 4 లక్షల వరకు పెరుగుతుందని, సెక్షన్‌ 80సీ పరిమి తితో పాటు గృహ రుణాలకు చెల్లించే వడ్డీపై లభించే రాయితీ పరిమితిని పెంచుతారని ఉద్యోగులు వేసిన అంచనాలేవీ నిజం కాలేదు. కాగా ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల వల్ల కేంద్రం నికరంగా రూ.15,500 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని జైట్లీ చెప్పారు. కాగా, ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీ ఆర్‌)లు ఆలస్యమైతే పదివేల రూపాయల జరిమానా విధించాలని బడ్జెట్లో ప్రతిపాదిం చారు. అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ అంటే...!
ఉద్యోగులతో పాటు వ్యాపారేతర ఆదాయం కలిగిన వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల వంటి వృత్తి నిపుణులకు కూడా ఈ పన్ను శ్లాబులు వర్తిస్తాయి. అయితే ఈ పన్ను విధించేది ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌పైనే. అంటే... మీరు సంపాదించే మొత్తం ఆదాయం నుంచి తొలుత వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపుల్ని తీసేస్తారు. అంటే పీఎఫ్‌కు చెల్లించేది, హెచ్‌ఆర్‌ఏ/ ఇంటి అద్దెగా మినహాయించేది, ఇక సెక్షన్‌ 80సీ కింద వివిధ పథకాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్లు (గరిష్ఠంగా ఇది రూ.1.5 లక్షల వరకూ చేయొచ్చు), ఇతర సెక్షన్ల కింద వర్తించే వైద్యబీమా ఖర్చులు, వైద్య ఖర్చులు... ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనుక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్‌ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, 5 నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు