ఎమ్మెల్యే ఈరన్న పిటీషన్‌ కొట్టివేత

12 Dec, 2018 15:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ నేత ఈరన్న దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఎన్నికకు వ్యతిరేకంగా ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలన్న ఈరన్న వినతిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగాలు నిజమని రుజువు కావడంతో.. ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెల్సిందే. హైకోర్టు తీర్పుతో మడకశిర అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో.. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం. తిప్పేస్వామి మడకశిర ఎమ్మెల్యేగా కొనసాగుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ మడకశిరలో వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించాయి. కార్యకర్తలు, నియోజకవర్గ నాయకులు ర్యాలీగా వెళ్లి మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

మరిన్ని వార్తలు