మార్కులు తక్కువగా రావడంతో దారుణం

10 Dec, 2019 16:13 IST|Sakshi
టీచర్‌ చర్యకు నిరసనగా ఆందోళన

చండీగఢ్‌ : మార్కులు తక్కువగా వచ్చాయనే ఆగ్రహంతో నాలుగో తరగతి చదివే చిన్నారి ముఖంపై నల్లరంగు పూసి స్కూల్‌లో అందరి ముందూ తిప్పిన టీచర్‌ ఉదంతం హరియాణాలోని హిసార్‌లో వెలుగుచూసింది. టీచర్‌ చిన్నారిని హింసించడంతో బాలిక తల్లితండ్రులు స్కూల్‌ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసన చేపట్టారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రైవేట్‌ పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్‌ చేశారు.

ఈనెల 6న నిర్వహించిన పరీక్షలో తమ కుమార్తెకు మార్కులు తక్కువగా రావడంతో మహిళా టీచర్‌ తమ కుమార్తె ముఖానికి స్కెచ్‌ పెన్‌తో నల్లరంగు అద్దారని, స్కూల్‌ చుట్టూ తిప్పారని ఆయన ఆరోపించారు. చిన్నారికి పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చినా టీచర్‌ ఇలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. మరోవైపు ఈ బాలికతో పాటు మరో ముగ్గురు బాలికల పట్ల కూడా మార్కులు తక్కువ వచ్చాయంటూ టీచర్‌ ఇదే తీరుగా వ్యవహరించారని విద్యార్ధులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు