విడాకుల వ్యవహారం; అఙ్ఞాతంలోకి తేజ్‌ ప్రతాప్‌

6 Nov, 2018 13:56 IST|Sakshi

పట్నా : భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనను విరమించుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ అఙ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లయి ఆరు నెలలైనా గడవక ముందే భార్య నుంచి విడాకులు కోరుతూ తేజ్‌ ప్రతాప్‌ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆధునిక భావాలున్న ఐశ్వర్యతో తనకు పొసగడం లేదని.. పెళ్లి తర్వాత జీవితం చాలా కష్టంగా గడుస్తోందంటూ విడాకుల దరఖాస్తులో పేర్కొన్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లాలూ కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కోపంతో తేజ్‌ ప్రతాప్‌ అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. (ఐశ్వర్యకే మద్దతు.. నా వాళ్లే కుట్రపన్నారు!)

బోధ్‌ గయ నుంచి బృందావనం వరకు..
గత రెండు రోజులుగా బోధ్‌ గయలోని ఓ హోటల్‌లో బస చేసిన తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సోమవారం మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. కాగా తమతో మాట్లాడిన అనంతరం తేజ్‌ ప్రతాప్‌ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని అతడి భద్రతా సిబ్బంది తెలిపారు. ఎంతసేపటికి ఆయన తలుపు తెరవకపోవడంతో తమ వద్ద ఉన్న వేరొక కీతో రూం తెరచి చూడగా.. వెనుక డోర్‌ నుంచి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. అక్కడ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో గల బృందావనం చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయంపై లాలూ కుటుంబ సభ్యులు ఇంతవరకు స్పందించలేదు. కాగా బిహార్‌ మాజీ సీఎం దరోగా రాయ్‌ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో మే 12వ తేదీన తేజ్‌ ప్రతాప్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు