‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం’

3 Nov, 2018 15:46 IST|Sakshi

పాట్నా : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. పెళ్లైన ఆర్నెళ్లకే విడాకులు కోరటం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ విషయం గురించి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ స్పందించారు.

‘ఇది నిజం.. నేను నా భార్య నుంచి విడాకులు కోరుకుంటున్నాను. మా ఇద్దరి అభిప్రాయాలు ఏమాత్రం కలవలేదు. ఆలోచనల్లోను, అభిరుచుల్లోనూ మేము ఇద్దరం ఉత్తర, దక్షిణ ధృవాల వంటి వాళ్లం. మేం కలిసుండటం అసాధ్యం. మేం చాలాసార్లు మా తల్లిదండ్రుల ముందే గొడవపడ్డాము. ప్రతి చిన్న విషయానికి గొడవపడటం తప్ప ఈ ఆర్నెళ్ల జీవితంలో మేం సంతోషంగా గడిపిన క్షణాలు లేవు. కలిసి ఉంటూ బాధపడే కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదనిపించింది. అందుకే విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరి గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసిన ఐశ్వర్య ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రికా రాయ్‌ కుమార్తె. ఈ ఏడాది మే 12వ తేదీన తేజ్‌ ప్రతాప్‌ - ఐశ్యర్యల వివాహమైంది. అయితే విడాకుల విషయం గురించి ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఇరుకుటుంబాల పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు