మోదీపై ఆర్జేడీ నేత సెటైర్లు

11 Apr, 2018 09:31 IST|Sakshi

సాక్షి, పాట్నా : బిహార్‌లో కేవలం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించారని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ తప్పుపట్టారు. బిహార్‌లో గంటకు 5059 మరుగుదొడ్లు నిర్మించడం సాధ్యమా అని ప్రశ్నించారు. మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కనీసం బిహార్‌ సీఎం కూడా దీన్ని అంగీకరించరని తేజస్వి ట్వీట్‌ చేశారు. వారానికి ఏడు రోజులు..రోజుకు 24 గంటలు..అంటే ఏడు రోజుల్లో 168 గంటలకు గాను ఒక్కో గంటలో 5059 మరుగుదొడ్లు నిర్మించారన్నది ప్రధాని వ్యాఖ్యల సారాంశమని, బిహార్‌లో ఇది సాధ్యమేనా అని తేజస్వి ప్రశ్నించారు.

ప్రధాని నుంచి ఇలాంటి బూటకపు ప్రచారం ఆశించలేమన్నారు. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలను బిహార్‌ సీఎం కూడా అంగీకరించబోరని తేజస్వి ఆక్షేపించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌కు స్ఫూర్తినిచ్చేలా బిహార్‌ ప్రభుత్వం వారంలోనే 8.5 లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించిందని సీఎం నితీష్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీలను మంగళవారం ప్రధాని మోదీ ప్రశంసించిన క్రమంలో తేజస్వి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు