ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో మొత్తంగా 66మంది ఉన్నారు గనుక ఇది చిన్న మంత్రివర్గం కిందే లెక్క! వాజపేయి సమయంలో ఎన్డీఏకైనా, అటు తర్వాత యూపీఏకైనా మిత్రుల బాదరబందీ ఎక్కువ. పదవులు దక్కని పార్టీలు అలకపాన్పు ఎక్కేవి. వారిని బుజ్జగించి దారికి తెచ్చుకునేసరికి... చోటు దక్కిన పార్టీలు ఫలానా ఫలానా శాఖలు కావాలంటూ పేచీ పెట్టేవి. ఇలా అందరి కోర్కెల నూ నెరవేర్చేసరికి కేబినెట్ సహజంగానే కిక్కిరిసిపోయేది.
మనోహర్ పారికర్ (కేబినెట్ హోదా)
గోవా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కిన మొదటి వ్యక్తి మనోహర్ పారికర్. ప్రధాని మోదీ పట్టుబట్టి మరీ పారికర్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని వదిలి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఐఐటీ ముంబై నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రుడైన 59 ఏళ్ల పారికర్కు పరిపాలనాదక్షునిగా, నిరాడంబరునిగా, నిజాయితీపరునిగా ప్రజల్లో గుర్తింపు ఉంది. గోవా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఆయన.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
సురేశ్ ప్రభు (కేబినెట్ హోదా)
చార్టర్డ్ అకౌంటెంట్ అయిన 61 ఏళ్ల సురేశ్ ప్రభు శివసేన తరఫున సుదీర్ఘ కాలం పనిచేశారు. కొంకణ్లోని రాజాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. వాజ్పేయి హయాంలో కీలక శాఖలను నిర్వర్తించారు. విద్యుత్శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ రంగంలో కొత్త ఒరవడి సృష్టించి ప్రశంసలు అందుకున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన విద్యుత్, బొగ్గు, పునరుత్పాదక శక్తి సమీకృత అభివృద్ధి సలహా సంఘం చైర్మన్గా నియమితులయ్యారు. త్వరలో జరగనున్న టీ 20 సదస్సు సందర్భంగా ప్రధానికి సలహాదారుగా నియమితులయ్యారు.
జేపీ నడ్డా (కేబినెట్ హోదా)
ఆర్ఎస్ఎస్ మూలాలున్న జగత్ ప్రకాశ్ నడ్డా ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. బీహార్కు చెందిన నేత అయినా నడ్డా రాజకీయ జీవితం హిమాచల్ ప్రదేశ్తో ముడిపడింది. 1993లో తొలిసారి హిమాచల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012లో నడ్డా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 54 ఏళ్ల నడ్డా హిమాచల్ ప్రదేశ్ పర్యావరణ, ఆరోగ్య, న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్లోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకోవడంలో నడ్డా కీలక పాత్ర పోషించారు.
బీరేందర్ సింగ్ (కేబినెట్ హోదా)
హర్యానాలోని జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత బీరేందర్సింగ్. 40 ఏళ్లు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన గత ఆగస్టులో బీజేపీలో జేరారు. ఆయన చేరికతో హర్యానా ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘనవిజయం సాధించింది. 68 ఏళ్ల బీరేందర్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2004లో హర్యానా సీఎం రేస్లో నిలిచినా చివరి నిమిషంలో భూపీందర్సింగ్ హూడా సీఎం అయ్యారు. 2010లో కాంగ్రెస్ ఆయన్ను రాజ్యసభకు పంపినా మన్మోహన్సింగ్ కేబినెట్లో బెర్త్ను చివరి నిమిషంలో నిరాకరించారు.
రాజీవ్ రూడీ (స్వతంత్ర సహాయ)
పైలట్, రాజకీయ నాయకుడైన రాజీవ్ ప్రతాప్ రూడీ ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజ్పుత్ వంశానికి చెందిన 52 ఏళ్ల రూడీ వాజ్పేయి కేబినెట్లో పలు శాఖలకు సహాయ మంత్రిగా, పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ లాలూ భార్య రబ్రీదేవిపై శరణ్ స్థానం నుంచి గెలిచారు.
హన్స్రాజ్ అహిర్ (సహాయ)
యూపీఏ హయాంలో బొగ్గు స్కాంను బయటపెట్టడం ద్వారా హన్స్రాజ్ అహిర్(59) పేరు ప్రచారంలోకి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ ఎంపీగా ఉన్న హన్స్రాజ్ తొలిసారి 1996లో 11వ లోక్సభకు ఎన్నికయ్యారు. 15వ లోక్సభలో 24 ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు.
రామ్కృపాల్ (సహాయ)
రామ్కృపాల్ యాదవ్(57) లాలూకు ఒకప్పుడు నమ్మినబంటు. గతంలో మూడు సార్లు ఆర్జేడీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవలి లోక్సభ ఎన్నికల ముందు పాటలీపుత్ర లోక్సభ టికెట్ను తనకు బదులు లాలూ ఆయన కుమార్తె మీసాభారతికి ఇవ్వడంతో తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఎన్నికల్లో మీసాను మట్టి కరిపించడం ద్వారా రామ్కృపాల్ ప్రతీకారం తీర్చుకున్నారు.
గిరిరాజ్సింగ్ (సహాయ)
వివాదాస్పద ప్రకటనలతో విరుచుకుపడే గిరిరాజ్సింగ్(62) బీహార్లోని నవాడ స్థానం నుంచి లోక్సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ గెలిస్తే ఆయన్ను వ్యతిరేకించే ముస్లింలు పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంటుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. మోదీకి తొలి నుంచి ఉన్న విధేయుల్లో గిరిరాజ్ ఒకరు.
జయంత్సిన్హా (సహాయ)
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడే జయంత్సిన్హా(51). ఐఐటీ ఢిల్లీ నుంచి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వరకు, ఆ తర్వాత రాజకీయాల్లోకి, ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన ప్రయాణం కొనసాగింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లోని హజారీ భాగ్ స్థానం నుంచి గెలిచారు. రాజకీయాలకు ముందు 25 ఏళ్లపాటు కార్పొరేట్ రంగంలో పనిచేశారు.
ముఖ్తార్ నఖ్వీ (సహాయ)
హిందుత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీలోని కీలక ముస్లిం నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. షియా మతస్తుడైన 57 ఏళ్ల నఖ్వీ వాజ్పేయి కేబినెట్లో సహాయ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ముస్లింలకు సంబంధించి పార్టీ వైఖరిని వెల్లడించడంలో నఖ్వీ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాజ్యవర్ధన్ రాథోడ్ (సహాయ)
ప్రముఖ క్రీడాకారుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్(43) 2004 ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో వెండి పతకాన్ని సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు. అంతకుముందు, ఆ తర్వాత ఎన్నో పతకాలు అందుకున్నారు. గతేడాది ఆర్మీ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీజేపీలో చేరి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని జైపూర్ స్థానం నుంచి గెలిచారు.
విజయ్సాంప్లా (సహాయ)
ప్రముఖ దళిత నేత అయిన విజయ్ సాంప్లా (53) ఒకప్పుడు ప్లంబర్. ఆయన పంజాబ్లోని హోషియార్పూర్ స్థానం నుంచి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తొలిసారి గెలుపొందారు. పదో తరగతి చదివిన సాంప్లా దుబాయ్లో కొంత కాలం ప్లంబర్గా పనిచేశారు. తర్వాత స్వరాష్ట్రం చేరుకుని వ్యాపారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్గా ఎన్నికవడంతో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది.
నిరంజన్ జ్యోతి (సహాయ)
మత ప్రబోధకురాలైన సాధ్వి నిరంజన్ జ్యోతి(47) రాజకీయంగా కీలకమైన యూపీలో దళితులు, వెనకబడిన తరగతులకు బీజేపీని దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఫతేపూర్ లోక్సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె, అంతకుముందు 2012లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రజాప్రతినిధిగా గెలుపొందారు.
రామ్శంకర్ (సహాయ)
రచయిత, దళిత నేత అయిన కతేరియా(50) ఆగ్రా స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డాక్టరేట్ చదివిన కతేరియా సామాజిక అంశాలు, దళితుల అభివృద్ధిపై పలు పుస్తకాలు రాశారు. గత లోక్సభ హయాంలో పలు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు.
మోహన్భాయ్ (సహాయ)
గుజరాత్కు చెందిన మోహన్భాయ్ కుందారియా(63) తొలి నాళ్లలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా పని చేశారు. పారిశ్రామిక వేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనకు పేరు ఉంది. రాజ్కోట్ లోక్సభ స్థానం నుంచి ఇటీవల గెలుపొందారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న కుందారియా... గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
బాబుల్ సుప్రియో (సహాయ)
పశ్చిమబెంగాల్ నుంచి బీజేపీకి ఉన్న ఇద్దరు ఎంపీల్లో బాబుల్ సుప్రియో(44) ఒకరు. పలు భాషల్లో గాయకుడిగా సుపరిచితుడైన సుప్రియో ఎంపీగా తొలి హయాంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి చేపట్టడం విశేషం. గత లోక్సభ ఎన్నికల్లో అసనోల్ లోక్సభ స్థానంలో విస్తృత ప్రచారం ద్వారా విజయం సాధించి ప్రధాని మోదీకి సన్నిహితులయ్యారు.
సన్వర్లాల్జాట్ (సహాయ)
రాజస్థాన్ సీఎం వసుంధరరాజెకు విధేయుడైన సన్వర్లాల్ (59) ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అజ్మీర్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ సచిన్ పైలట్ను మట్టికరిపించారు. ఇటీవలి వరకు రాజస్థాన్ జలవనరుల మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 2003-08 మధ్య వసుంధర రాజె ప్రభుత్వంలో, అంతకుముందు షెకావత్ ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేశారు.
హరిభాయ్ చౌధురీ (సహాయ)
గుజరాత్లోని బనస్కాంత స్థానం నుంచి నాలుగో పర్యాయం లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి(60) ఆ రాష్ట్ర బీజేపీ శాఖలో పలుఉన్నత పదవులు నిర్వహించారు. 1998లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన ఆర్థిక, వ్యవసాయం, ఎరువులు తదితర అంశాలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పనిచేశారు.