చెన్నై–రియాద్ విమానం 16 గంటలు ఆలస్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై–రియాద్ విమానంలోని ప్రయాణికులు 16 గంటలు నరకయాతనపడ్డారు. కేరళలోని కొచ్చి మీదుగా రియాద్ వెళ్లే సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ 292 మంది ప్రయాణికులతో ఆదివారం ఉదయం చెన్నై నుంచి బయలుదేరింది. కొచ్చికి చేరువవుతుండగా తీవ్రమైన సుడిగాలులు వీయడంతో సాయంత్రం చెన్నైకి తిరి గొచ్చింది. ప్రయాణికులను విమానంలోనే ఉంచారు. వాతావరణం అనుకూలంగా ఉం దని బయలుదేరవచ్చని రాత్రి 8 గంటలకు కొచ్చి నుంచి సమాచారమందింది. అయితే తమ డ్యూటీ అయిపోయిందని పైలెట్, కోపైలెట్ వెళ్లిపోయారు. ‘పైలెట్లను తీసుకొస్తున్నాం. రాత్రి 11 గంటలకు బయలుదేరుతున్నాం’ అని ఎయిర్హోస్టెస్లు చెప్పారు.
అయితే రాత్రి 11 గంటలకు బయలుదేరలేదు. ‘మరో విమానాన్ని రప్పిస్తున్నాం, అది చేరుకోగానే వెళ్దాం’ అని సిబ్బందిప్రకటించారు. ఇలాంటి ప్రకటనలతోనే అర్ధరాత్రి ఒంటి గంట కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానం నుంచి దించివేస్తే తామే ప్రత్యామ్నాయం వెతుక్కుంటామన్నారు. చెకింగ్ కొచ్చిలోనే జరగాల్సి ఉందనీ, చెన్నైలో ఆ వసతి లేదు కాబట్టి విమానం నుంచి దిగేందుకు వీలులేదని ఎయిర్ హోస్టెస్ నిరాకరించారు. ఆకలితో అలమటిస్తున్నామని ప్రయాణికులు కేకలు వేయడంతో సిబ్బంది ఆహార పొట్లాలు పంపిణీచేశారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సౌదీ ఆరేబియన్ ఎయిర్లైన్స్ విమానం చెన్నైకి చేరుకోగా అందులోని ప్రత్యామ్నాయ పైలెట్లు విధుల్లో చేరగా ఉదయం 10 గంటలకు ఈ విమానం కొచ్చికి బయలుదేరింది.