సాక్షి, న్యూఢిల్లీ: నేడో, రేపో అంటూ వార్తలొస్తున్నప్పటికీ.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆగస్టు 30, 31న మంత్రిత్వ శాఖలు, విభాగాల వారీగా సమీక్షలు, మంత్రుల అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారైపోయాయి. మరోవైపు రాష్ట్రపతి భవన్ సమాచారం మేరకు సెప్టెంబర్ 1న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుపతి పర్యటన ఖరారైంది
. ఇక సెప్టెంబర్ 2 బక్రీద్ కావడంతో ప్రభుత్వ సెలవు దినం. అందువల్ల ఆ నాలుగు రోజుల్లో విస్తరణ దాదాపుగా ఉండనట్లే.. సెప్టెంబర్ 3న మోదీ చైనా పర్యటనకు వెళ్తున్నారు. చైనాలో జరిగే బ్రిక్స్ సదస్సు, మయన్మార్ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 7న ప్రధాని భారత్కు తిరిగి రానున్నారు. ఇదే సమయంలో సెప్టెంబర్ 5 నుంచి 20 వరకూ శ్రాద్ధ(అశుభ) దినాలు. ఆ రోజుల్లో కొత్త పనులు, మంచి పనులు చేపట్టరు. అందువల్ల సెప్టెంబర్ 20 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది.
చైనా పర్యటనకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వచ్చే నెల 3 నుంచి 5 మధ్య చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించింది. జియామెన్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. డోక్లాం వివాదం సద్దుమణిగిన తరువాతి రోజే ఈ ప్రకటన వెలువడటం గమఔఉర్హం. ‘చైనా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జియామెన్లో జరిగే 9వ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని హాజరవుతారు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.