బెంగళూరు: జయలలిత తరువాత.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి జయలలిత అక్రమాస్తుల కేసుపై తీర్పిచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైఖేల్ డీ కన్హా. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసు విచారణను నిష్పక్షపాతంగా, నిష్కర్షగా, నిర్మొహమాటంగా జరిపారన్న పేరును ఆయన సంపాదించారు. 2003లో ఈ కేసు బెంగళూరు కోర్టుకు బదిలీ అయిన తరువాత.. దీన్ని విచారించిన ఐదో జడ్జి జాన్ మైఖేల్. 2013 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యాక తుది వాదనలను మళ్లీ విన్నారు.
విచారణ సందర్భంగా పలుమార్లు నిందితులను, వారి తరఫు న్యాయవాదిని ఆక్షేపించారు. కేసు విచారణను సాగదీసేందుకు ప్రయత్నించవద్దని, వాస్తవాలను అణిచేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. మంగళూరుకు చెందిన జాన్ మైఖేల్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2002లో జిల్లా జడ్జి అయ్యారు. పలువురు హైకోర్టు చీఫ్ జస్టిస్ల వద్ద సెక్రటరీగా, కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశారు.