ముసాయిదా సిద్ధం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు జడ్జీలను అటార్నీ జనరల్, అడ్వొకేట్ జనరల్ల ద్వారా ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్(ఎంఓపీ) ముసాయిదాను సిద్ధం చేసింది. సుప్రీంకోర్టుకు జడ్జీలను నియమించే కొలీజియంకు ఎంఓపీ మార్గదర్శనం చేస్తుంది. ఒకవేళ సుప్రీం ఈ ముసాయిదాను ఆమోదిస్తే అటార్నీ జనరల్ అత్యున్నత న్యాయాధికారిగా జడ్జీలను ప్రతిపాదించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.
అటార్నీ జనరల్ ద్వారా కేంద్రం... అడ్వొకేట్ జనరల్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు జడ్జిలను ప్రతిపాదించవచ్చు. అలాగే బార్ కౌన్సిల్ నుంచి ముగ్గురు వరకు జడ్జిలు ఉండాలని నిబంధన విధించింది. మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ ముసాయిదాకు తుది రూపునిచ్చి ఆమోదం కోసం భారత ప్రధాన న్యాయమూర్తికి పంపింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంపికలో హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులు, న్యాయ పరిపాలనా వ్యవస్థ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, ప్రతిభ, సీనియారిటీ వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఈ ముసాయిదా చెబుతోంది.