కైలాష్‌ సత్యార్థి ఇంట్లో చోరి.. నోబెల్‌ సర్టిఫికెట్‌ మాయం

7 Feb, 2017 12:13 IST|Sakshi
కైలాష్‌ సత్యార్థి ఇంట్లో చోరి.. నోబెల్‌ సర్టిఫికెట్‌ మాయం

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి ఇంట్లో దొంగలు పడ్డారు. సామాజిక సేవకు గుర్తింపుగా ఆయనకు లభించిన విశిష్ట అవార్డు నోబెల్‌ బహుమతికి సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎత్తుకెళ్లారు. ఆయన ఇంటిని దుండగులు చిన్నాభిన్నం చేసినట్లు కూడా తెలిసింది. అయితే, నోబెల్‌ బహుమతి ఆయన జాతికి అంకితం చేసిన నేపథ్యంలో అది ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌లో ఉన్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. సామాజిక ఉద్యమకారుడే అయినప్పటికీ కైలాస్ సత్యార్థి భారతీయ బాలలహక్కుల కోసం అమితంగా పోరాడే ప్రముఖ ఉద్యమకారుడు. ఆయన 1980లో బచ్‌పన్ బచావో ఆందోళన్ (బాల్యాన్ని కాపాడే ఉద్యమం) స్థాపించి, 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఉద్యమాలు నడిపారు.

ఆయన 2014 నోబెల్ బహుమతిని, పాకిస్థాన్‌ అక్షర సాహసి మలాలా యూసఫ్‌జాయ్‌తో సంయుక్తంగా "యువత, బాలల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి, బాలలందరికీ విద్యాహక్కు’ అనే అంశానికి నోబెల్‌ పురస్కారం పొందారు. తాజాగా ఆయన ఇంట్లో పడిన దొంగలు ఈ నోబెల్‌ అవార్డుతోపాటు పలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కైలాష్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు