భారత్‌లో ఎన్నికలు; పాకిస్తాన్‌ నుంచి ఓట్లు!

7 May, 2019 18:22 IST|Sakshi
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ కార్యాలయ సిబ్బంది (ట్విటర్‌ ఫొటో)

న్యూఢిల్లీ: మన దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్తాన్‌ నుంచి కొంత మంది ఓటు వేశారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌ నుంచి దాదాపు వందమందిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారు. ఓటు వేసిన వారందరూ భారతీయులే. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారంతా ఈ-పోస్టల్‌ బ్యాలెట్‌(ఈటీపీబీఎస్‌)తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ ఓటర్‌ విధానంతో భారత సార్వత్రిక ఎన్నికల్లో తమ గళాన్ని వినిపించే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా, ఇప్పటికే ఐదు విడతల ఎన్నికలు ముగిశాయి. మరో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ జరగాల్సివుంది. ఈనెల 19 నాటికి ఎన్నికల పోలింగ్‌ ముగుస్తుంది. 23న ఓట్లు లెక్కిస్తారు.

ఈటీపీబీఎస్‌ అంటే...
ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్(ఈటీపీబీఎస్‌)ను సర్వీసు ఓటర్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగులను సర్వీసు ఓటర్లుగా పరిగణిస్తారు. సీ-డాక్‌ రూపొందించిన ఈటీపీబీఎస్‌ అత్యంత సురక్షితమైందని, రెండంచల్లో భద్రత ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఓటీపీ, పిన్‌ ద్వారా గోప్యత పాటిస్తారు. స్పష్టమైన క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది కనుక రెండుసార్లు ఓటు పడే అవకాశం(డూప్లికేషన్‌) ఉండదు. సర్వీసు ఓటర్లతో పాటు ఉంటున్న భాగస్వాములు(భార్య/భర్త), విదేశాల్లో ఉంటున్న రక్షణ శాఖ ఉద్యోగులు దీని ద్వారా ఓటు వేయొచ్చు.

తమ నియోజకవర్గానికి వెలుపల ఉన్న సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎస్ ద్వారా ఎక్కడినుంచైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి ఈటీపీబీఎస్ ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే ఓటీపీ కావాలి. ఈ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పంపించేందుకు పిన్‌ తప్పనిసరి. ఎన్నికలకు 16 రోజుల ముందు ఈ-బ్యాలెట్‌ పంపించాలి. సర్వీసు ఓటరుగా ముందుగా నమోదు చేయించుకుంటేనే దీన్ని వాడగలరు. సర్వీసు ఓటర్లు  పంపించిన ఈ-బ్యాలెట్‌ ఎన్నికల రిటర్నింగ్ అధికారి‌(ఈఆర్‌ఓ)కి మాత్రమే కనబడుతోంది. దాన్ని ఆమోదించే, తిరస్కరించే అధికారం ఈఆర్‌ఓకు మాత్రమే ఉంటుంది.

ఈటీపీబీఎస్‌లో ఓటు వేసేదిలా...

మరిన్ని వార్తలు