‘వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలి’

5 Nov, 2017 12:00 IST|Sakshi

భోపాల్‌ : ‘వాళ్లకు భూమ్మీద జీవించే హక్కు లేదు. అటువంటి వాళ్లను నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఉరితీయాలి. అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండటానికి ఎటువంటి అర్హత లేద’ని భోపాల్‌ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలు డిమాండ్‌ చేశారు. ఘటన మూడు రోజులు తరువాత ఆమె తొలిసారి మీడియాతో మాట్లాడారు. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థినిపై మంగళవారం నాడు నలుగురు యువకులు మూడు గంటలపాటు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి దగ్గరలోనే హబీబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఉన్న పోలీసులు బాధితురాలిని కాపాడలేకపోయారు. తనను కిడ్నాప్‌ చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కళ్లు మూసుకున్నారని ఆమె ఆవేదన ‍వ్యక్తం చేశారు.

తాను పోలీస్‌ అధికారి కుమార్తెను అని చెప్పకపోయి ఉంటే.. అత్యాచారం తరువాత తనను హత్యచేసేవారని ఆమె చెప్పారు. హబీబ్‌గంజ్‌ పోలీస్‌ అధికారుల ప్రవర్తన అత్యంత హేయంగా ఉందని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసు విషయం‍లో అలసత్వం ప్రదర్శించిన 5 మంది పోలీసులను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలగించింది. అంతేకాక ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు