నాలుగే నిమిషాల్లో ఇల్లుగుల్ల

25 May, 2017 22:16 IST|Sakshi
నాలుగే నిమిషాల్లో ఇల్లుగుల్ల

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కారులో వచ్చిన దొంగలు తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి క్షణాల్లో పని ముగించుకుని వెళ్లిపోయారు. విలువైన వస్తువులన్నిటినీ ఇంట్లోనే ఉన్న సూట్‌కేసులో సర్దుకుని అక్కడి నుంచి దర్జాగా ఉడాయించారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు కాగా చూసి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతయింది. వివరాల్లోకి వెళితే దొడ్డబళ్లాపురం పాత బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెస్తరపేటలో నివసిస్తున్న నరేష్‌ బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే పూజకు వెళ్లాడు.

విషయం పసిగట్టిన గుర్తు తెలియని దొంగలు దర్జాగా కారులో అక్కడికి చేరుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.30 వేల నగదుతో ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉన్న ఒక సూట్‌కేస్‌లో సర్దుకుని వెళ్లిపోయారు. గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన నరేష్‌ కుటుంబం చోరీ జరిగిన సంగతి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు ఇద్దరు ఒక ఇండికా కారులో వచ్చి నాలుగే నిమిషాల్లో చోరీ సొత్తున్న సూట్‌కేస్‌తో వెళ్లడం ఇంటి ముందు ప్రైవేటు కార్యాలయం సీసీ టీవీలో రికార్డయింది. తెలిసిన వారే ఈ చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు