స్వామీజీ అంత్యక్రియల్లో నిబంధనల ఉల్లంఘన

19 May, 2020 15:30 IST|Sakshi

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన

భోపాల్‌ : ప్రముఖ ఆధ్మాత్మికవేత్త దాదాజీగా పేరొందిన దేవ్‌ ప్రభాకర్‌ శాస్త్రి అంత్యక్రియలకు మధ్యప్రదేశ్‌ మంత్రులు, బాలీవుడ్‌ స్టార్లు సహా వేలాది మంది తరలివచ్చారు. ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం కన్నుమూసిన శాస్త్రి అంత్యక్రియలు కట్నిలో జరిగాయి. లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అంత్యక్రియల సందర్భంగా ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడటం కలకలం రేపింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ప్రకారం అంత్యక్రియల్లో 20 మందికి మించి ప్రజలు పాల్గొనడాన్ని అనుమతించారు.

పూర్తి అధికార లాంఛనాలతో జరిగిన స్వామీజీ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో పాలక బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. బాలీవుడ్‌ నటులు అశుతోష్‌ రాణా, రాజ్‌పాల్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లఖన్‌ గంగోరియా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత్యక్రియల సందర్భంగా లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులు ఎవరూ పెదవివిప్పలేదు. దాదాజీ పట్ల ప్రజల్లో విశ్వాసం, భక్తిభావం ఉన్నా లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించాల్సిన అవసరం ఉందని మద్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, మాజీ మంత్రి జీతూ పట్వారీ అన్నారు. 

చదవండి : లాక్‌డౌన్‌ సడలింపుల వేళ గుడ్‌ న్యూస్‌!

మరిన్ని వార్తలు